జగిత్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైతులకు రుణమాఫీ చేయవద్దని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసిందని, అందువల్లనే నిలిచిపోయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జగిత్యాల నియోజకవర్గపరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజ య్ కుమార్కు మద్దతుగా ఆమె శుక్రవారం రోడ్షో నిర్వహించారు. వేల మందితో సాగిన రోడ్డుషోలో కవిత మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ మొదటి విడుత పూర్తి చేశామని, రెండో విడుతలో 21 వేల కోట్ల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు.
ఇందులో 17వేల కోట్ల రుణమాఫీ జరిగిపోయిందని, మరో ఐదువేల కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉండగా, కాంగ్రెస్ నాయకులు.. రుణమాఫీ చేయవద్దని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని, దీంతో ఐదువేల కోట్ల రుణమాఫీ నిలిచిపోయిందని చెప్పారు. గత సీఎంలు చంద్రబాబు, వైఎస్ ఏనాడైనా రైతుల గురించి, సాగునీరు, కరెంట్ గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే కేవలం పార్టీలు మాత్రమే గెలుస్తాయని, బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ప్రజలు గెలుస్తారని చెప్పారు. దేశంలో 16 రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నా ఎక్కడా వారికి పెన్షన్ ఇవ్వడం లేదని, సీఎం కేసీఆర్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేనాటికి గ్యాస్ సిలిండర్ ధర 400 ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.1200కు పెంచి మహిళల నడ్డి విరిచారని విమర్శించారు.
ప్రధాని మోదీ సిలిండర్తో పాటు, ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ, మంచినూనె ధరలను కూడా పెంచాడని చెప్పారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సిలిండర్ను 400కే అందజేస్తామని, ఆస రా పిఛన్ను రూ.5వేలకు పెంచనున్నామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారు. అలా ఇస్తే పంటలు పం డుతాయా..? అని ప్రశ్నించారు. బీజేపీ వాగ్దానాలకు, నేతల వ్యవహారశైలికి అంతూపొంతులేదని విమర్శించారు. రోడ్షోలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్ పాల్గొన్నారు.
ఖలీల్వాడి, నవంబర్ 18: తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలకు గాంధీ కుటుంబమే కారణమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తుచేసేందుకు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన వీడియోను శనివారం ఎక్స్ (ట్విట్టర్)లోపోస్టు చేశారు. నిజామాబాద్ విద్యార్థులు, యువత ఆత్మఘోషను వినాలని రాహుల్గాంధీకి సూచించారు.