హైదరాబాద్, జూలై 26 (నమస్తేతెలంగాణ): ప్రశ్నించే విద్యార్థులను దేశద్రోహులుగా ముద్రవేసి కాల్చి చంపినా తప్పులేదని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్చిచంపేందుకు ఇదేమైనా సౌదీ అరేబియా దేశ రాజ్యాంగమా? అని సూటిగా ప్రశ్నించారు. నేటి తరం జెన్జీలు ప్రశ్నించే పిడుగులని, వారి హక్కును కాలరాస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ మాటలను పక్కనబెట్టి సౌదీ ఆరేబియా భాష మాట్లాడడం శోచనీయమని పేర్కొంటూ.. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘నీట్ లీకేజీ వ్యవహారంలో నరేంద్రమోదీకి భజన చేయడం మానుకోవాలని, ప్రశ్నించే నేటి తరంపై కరుణ చూపాలని, వారి ప్రశ్నలకు జవాబు చెప్పాలన్న మోహన్ భాగవత్ మాటలను వినండి’ అని హితవు పలికారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ నేత పాశం మధుకర్ యాదవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థులు పూరించిన విప్లశంఖానికి కేంద్రం తలవంచకతప్పలేదని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని విద్యార్థుల విజయంగా అభివర్ణించారు.
జెన్జీ పోరాటానికి ఢిల్లీ సర్కార్ తోకముడిచిందని శ్రవణ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కొండా విశేశ్వర్రెడ్డి వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం, విదేశీ ఫండింగ్ ఉన్నదని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి తిండి అందుతున్నదని చిల్లర ప్రచారం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్రమంత్రిననే సోయిలేకుండా విద్యార్థులను పాకిస్థానీలని మాట్లాడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారు పాకిస్థాన్కు చెందిన వారైతే కేంద్ర పెద్దలు ఎందుకు చర్చించారని నిలదీశారు.
ధన అహంకారంతో విర్రవీగుతున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి జెన్జీ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి యువతను ఇతర దేశాల్లో అయితే కాల్చిపాడేసేవారని ఆయన అనడం బాధాకరమని పేర్కొన్నారు. ‘నిరసన తెలిపినవారిని కాల్చితే నీట్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసినోళ్లను ఏం చేయాలి? పదవులిచ్చి అందలమెక్కించాలా?’ అని నిలదీశారు. కోట్ల రూపాయలు వెనుకేసుకున్న విశ్వేశ్వర్రెడ్డికి పేద బిడ్డల బాధలు ఎలా అర్థమవుతాయని దెప్పిపొడిచారు.
సౌదీ అరేబియాలో పేపర్లు లీక్ చేసినవారిని రాళ్లతో కొట్టి చంపుతారని, మన దేశంలో ఇందుకు కారకుడైన ధ్మంద్రే ప్రధాన్కు కూడా అదే శిక్ష విధించాలా? అని విశ్వేశ్వ ర్రెడ్డిని ప్రశ్నించారు. నేటి తరం పిల్లలు కణకణ మండే అగ్గిరవ్వలని, వారి హక్కులను హరిస్తే తిరుగుబాటుకు దిగుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు బంద్ చేయాలని, లేకుంటే జెన్జీ కోపాగ్నిలో దహించుకుపోతారని హితవు పలికారు.
ఇందిరాపార్క్ వద్ద కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన నిరసన దీక్షలో ముక్కుపచ్చలారని యువకుల ఆగ్రహాన్ని కళ్లారా చూశానని శ్రవణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు గళమెత్తి పోరాడిన తీరు తనను ఎంతగానో కదిలించిందన్నారు. వారు ఎంగిలి మెతుకులకు ఆశపడేవారు కాదని, నియంతల మెడలు వంచే నవతరం దేశ నిర్మాతలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన శాసన, కార్యానిర్వాహక, న్యాయ వ్యవస్థలనే ప్రశ్నిస్తున్న జెన్జీని అణచివేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యంకాదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హితవు పలికారు.