మారేడ్పల్లి, డిసెంబర్ 14: మోండా డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. దీనిలో భాగంగా మంగళ వారం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి,ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మోండా డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మారేడ్పల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్ను త్వరగా పూర్తి చేసి వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
అంతేకాకుండా కమ్యూనిటీహాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేసి నిర్ణీత ధరను నిర్ణయించాలన్నారు. లోహియానగర్, అంబేద్కర్నగర్ బస్తీలో ఎస్సీ కమ్యూనిటీహాల్,పరికిబస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్కు వివరించారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో అధునాతన మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. గుంతలమయంగా మారిన బీటీ రోడ్లను వెంటనే పునరుద్ధ్దరించాలని ఎమ్మెల్యే సాయన్న అధికారులకు సూచించారు.
నెహ్రూనగర్ పార్కులో దంగల్ బిల్డింగ్ నిర్మాణ పనులను సత్వరమే చేపట్టాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణకు కోటి పది లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మోండా డివిజన్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహాముదిరాజ్, ఆకుల హరికృష్ణ, గణపతి ఆలయం మాజీ చైర్మన్ పిట్ల నాగేష్ ముదిరాజ్, సదానంద్గౌడ్ పాల్గొన్నారు.