వేములవాడ, జూన్ 7: తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధితో లక్ష ఎకరాలకు నీరందించామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చడం గర్వకారణంగా ఉన్నదన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వేములవాడలోని మహారాజ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఎందరో పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. 3 టీఎంసీల సామ ర్థ్యం కలిగిన మల్కపేట రిజర్వాయర్ పూర్తికావడంతో నిమ్మపల్ల్లి చెరువు వరకు గోదావరి జలాలు తరలి వెళ్లనున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశలో నిమ్మపల్లి ప్రాజెక్టు కోసం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు 100రోజుల పాదయాత్ర చేశారని గుర్తు చేశా రు.
మెట్ట ప్రాంతంలో నీటి వనరులు పెరగడంతో విద్యుత్పై ఆధారపడడం తగ్గి భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని చెప్పారు. మరోవైపు కథలాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల కాలువను రిజర్వాయర్గా మార్చి 18వేల ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు. పారదర్శక పాలనతో పేదలకు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు. చేసిన అభివృద్ధి కండ్లముందు కనిపిస్తుండడంతో ప్రజలు కాంగ్రెస్ బీజేపీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మడం లేదని చెప్పారు. ప్రజా సమస్యల పరిషరించాకే తాను రాజకీయల్లోకి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పెండింగ్ పనులు పూర్తిచేస్తామని చెప్పారు. రూ. 100కోట్ల పట్టణ ప్రగతి పనుల ప్రారంభానికి మంత్రి కేటీఆర్ ఈ నెల 16న వేములవాడకు వస్తున్నారని తెలిపారు. అంతకుముందు నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ ఫొటో గ్యాలరీని ఎమ్మెల్యే రమేశ్ బాబు, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్తో కలిసి పరిశీలించారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ ఏస్ఈ సుమతీ దేవి, ఈఈ అమరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎంపీపీలు చంద్రయ్యగౌడ్, బైరగొని లావణ్య, గంగం స్వరూపరాణి, జవ్వాతి రేవతి, కోనకంటి ఉమాదేవి, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, గట్ల మినయ్య, నాగం భూమయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ బాల్రెడ్డి, సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు, ఆకుల దేవరాజు, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, డీఈలు ప్రశాంత్, శ్రీనివాస్, సత్యనారాయణ, ఆరుణ్, రాజు, రఫీ, ఎం శ్రీనివాస్, విష్ణు తదితరులు ఉన్నారు.
నీళ్ల కోసం పుట్టెడు కష్టాలు పడ్డాం
సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తాగు, సాగు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలు పడ్డాం. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. పాడుబడిన బోరుబావులు కూడా పనిచేస్తూ గుంట జాగా కాళీ లేకుండా సాగు విస్తీర్ణం పెరిగింది. రుద్రంగిలోనే లక్ష క్వింటాళ్ల వడ్లు పండిస్తుండడం ఇందుకు నిదర్శనం.
-గంగం స్వరూపారాణి, ఎంపీపీ, రుద్రంగి
వలసలు తగ్గినయ్..
ఒకప్పుడు ఈ ప్రాంతంలో సాగునీరు లేక వలసలు పోయేది. ముంబైతో పాటు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం పోయేవారు. అట్లాంటి పరిస్థితులు నుంచి బయటపడి వలసలు ఆగిపోయి నీటి వనరులు పెరిగిపోవడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ప్రభుత్వం సాగునీటి రంగంలో విప్లవాత్మమైన మార్పులు తీసుకువచ్చింది.
-బైరగోని లావణ్య, ఎంపీపీ, చందుర్తి
అబ్బురపరిచిన కాళేశ్వరం
సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. గోదావరి జలాలు ఎత్తిపోస్తూ రాజరాజేశ్వర జలాశయం వరకు చేరి మలపేట రిజర్వాయర్కు చేరుతున్నాయి. మారుపాక, చంద్రగిరి, నాంపల్లి వరకు కాలువల ద్వారా నీళ్లు రానున్నాయి. ఇది సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనం.
-మ్యాకల రవి, జడ్పీటీసీ, వేములవాడ అర్బన్
7.43 మీటర్లకు భూగర్భ జలాలు
వేములవాడ నియోజకవర్గంలో 411 చెరువుల ఆయకట్టు కింద 30, 719 ఎకరాలు సాగవుతన్నయ్. 2014కు ముందు భూగర్భ జలా లు 15 నుంచి 20 మీట ర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పు డు 7.43 మీటర్లకు ఎగిసివచ్చినయ్. రూ. 142 కోట్లు వెచ్చించి మిషన్కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణతోనే ఇది సాధ్యమైంది. 3.56 టీఎంసీల నీటి సామ ర్థ్యం పెరిగింది. రూ. 62 కోట్లతో మూలవాగుపై 12చెక్ డ్యాంలు నిర్మించడంతో 120 ఎంసీఎఫ్టీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగిం ది. కాళేశ్వరం ప్యాకేజీ 9ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందనున్నది.
– అమరేందర్ రెడ్డి, ఈఈ
ముందుచూపుతో ప్రాజెక్టులు
సీఎం కేసీఆర్ 50 ఏళ్ల ముందు చూపుతో సాగునీటి, తాగునీటికి అవసరమయ్యే ప్రాజెక్టులను నిర్మించారు. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నదానికి, తెలంగాణ కోటి ఎకరాల మాగాణానికి అన్న విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. నీటి కోసం గోస పడే రోజులు పోయి విస్తారంగా నీటి లభ్యత పెరిగింది.
-ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్
రుణపడి ఉంటారు
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో నీటిని తరలించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అభినందనీయం. కాలువల ద్వారా ఈ విధానంతో మండలంలోని ప్రతి గ్రామ చెరువును నింపితే 46వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని పనులు వేగవంతంగా చేస్తే మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు.
-నాగం భూమయ్య, జడ్పీటీసీ (కథలాపూర్)