నాగర్కర్నూల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. పదేండ్ల ప్రజాప్రస్థానంలో మర్రి అన్న పేరిట చేపట్టిన పాదయాత్రను శనివారం తెలకపల్లి మండలం గౌరారంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు కుంకుమ పెట్టి మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. తొలిరోజు గౌరారం, పర్వతాపురం, రాకొండ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది.
ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉండడంతో ఎకరం భూమి రూ.30లక్షలకు చేరిందన్నారు. ప్రస్తుతం ఎక్కడైనా కరెంట్ పోతుందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ.2వేల పింఛన్ కూడా ఇవ్వకుండా అధికారంలోకి వస్తే రూ.4వేలు ఇస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. కాంగ్రెసోళ్లకు మహిళల ఓట్లు కావాలి కానీ.. మంచినీటి కోసం వారు పడుతున్న కష్టాలు మాత్రం పట్టవన్నారు. తనను ఓడగొట్టేందుకు ఇద్దరు కంకణం కట్టుకున్నారని, ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలకు తెలుసనన్నారు. పదేండ్లలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు పాదయాత్రగా ప్రజల ముందుకు వస్తున్నానని, ఇంకా ఏం చేయాలో తెలుసుకుంటానని చెప్పారు.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. బట్టల వ్యాపారంలో సంపాదించిన డబ్బులతోనే సేవ చేస్తున్నానని స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ నియోజకవర్గానికి ఇంజినీరింగ్ కళాశాలను తప్పకుండా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం సేవ చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యలను గుర్తించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆదివారం ఉదయం రాకొండలో ప్రారంభమై లక్నారం, గోళగుండం, జంగమోనిపల్లి, బొప్పెల్లి, ఆలేరు వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మర్రి జమున, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్గౌడ్, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.