రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉన్నది. అందరూ మనవైపే ఉన్నరు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయావకాశాలు మనకే ఉన్నయి.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదామని, కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను వివరించి కరీంనగర్ అభ్యర్థి బీ వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 10న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తంగళ్లపల్లి మండలం తాడూరుకు చేరుకున్న ఆయన, గ్రామంలో ప్రమాదవశాత్తూ దగ్ధమైన ఈత వనాలను పరిశీలించారు. తమను ఆదుకోవాలంటూ గౌడ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేయగా, వారికి ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చారు. అనంతరం పలు కార్యక్రమాలకు హాజరై సిరిసిల్లకు చేరుకున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి క్లస్టర్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీ వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా లబ్ధిపొందిన స్వార్థ నాయకులే పార్టీని వీడుతున్నారని, పోయినోళ్ల గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
పల్లెపల్లెలో చురుకైన కార్యకర్తల్ని తయారు చేసుకుందామన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉంటానని, భవిష్యత్ మనదేనని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్పై ప్రజలకు ఎంతో అభిమానం ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు ఓటు ఎందు కు వేయలేదని మనస్తాపం చెందుతున్నారని చెప్పా రు. కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగు బాటుకు సిద్ధమవుతున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించిందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో? ఇంకా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని, అవి చీకటి దోస్తులంటూ విమర్శించారు. బండి సంజయ్ని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి ని నిలబెట్టిందన్నారు. సంజయ్ ఐదేండ్లలో జిల్లాకు చేసిందేమిటని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నల కోసం ఒక్క పనైనా చేశాడా..? అన్ని ప్రశ్నించారు. మత రాజకీయాలు తప్ప అభివృద్ధిపై ఊసెత్తని బండికి ఓటేసి నష్టపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీగా వినోద్ గెలిస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగారావు, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్రావు, గుగులోత్ కళావతి, ఎంపీపీలు పిల్లి రేణుక, మాలోతు బూలా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.