MLA Malla Reddy | శామీర్పేట, ఏప్రిల్ 29: సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో కృషి చేస్తే సఫలత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో సోమవారం టెడ్ ఎక్స్ ప్రారంభోత్సవ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలన్నారు. సాధారణ జీవన శైలికి అసాధారణ ఆలోచనా విధానాన్ని మేళవించాలన్నారు. మార్కెట్లో ఒక మంచి వాణిజ్య అవకాశంగా మలచుకోవాలన్నారు.
విద్యార్థులు తమ జీవితంలో అతి తక్కువ కాలంలో ఆర్థిక స్వాతంత్రం పొందాలన్నారు. తమ చర్యల ద్వారా తమ నిర్ణయాల ద్వారా పది మందికి సహాయపడుతూ సమాజంలో ప్రతి సంవత్సరం తమ విలువ పెంచుకునేలా విద్యార్థులు అడుగులు ముందుకు వేయాలని హితువు పలికారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు ఎంచుకునే మార్గం విషయంలో అవసరమైన వనరుల విషయంలో ఉపయోగపడే మార్గదర్శకుడి విషయంలో ఒక స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి, అజయ్ హనుమంతు, రాజా నరేన్, భార్గవి, నవీన్ చారి, సతీశ్ వర్మ, నేత్రారెడ్డి, అధ్యాపక సమన్వయకర్తలు డాక్టర్ బీకే రాజ్యలక్ష్మీ, డాక్టర్ శివప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.