పరకాల, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తొమ్మిదిన్నరేళ్లలో రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చామని పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వెల్లంపల్లి రోడ్డులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలకుల హయాంలో పరకాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కుట్రలు పన్ని పరకాల రెవెన్యూ డివిజన్ను రాత్రికి రాత్రే తరలించారని విమర్శించారు. కానీ ప్రతేక రాష్ట్రంలో పరకాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. నియోజకవర్గంలో కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు రెవెన్యూ డివిజన్ను పునరుద్ధరించుకొని పాలనా భవనాలను కార్పొరేట్ తరహాలో నిర్మించుకున్నామని వివరించారు. పరకాల శివారులో వంద పడకల దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని, అది పూర్తయితే చట్టుపక్కల మండలాలకు వైద్య సదుపాయాలు మెరుగవుతాయన్నారు. పరకాలలో ప్రధాన రహదారులన్నీంటిని విస్తరించుకుని నలువైపులా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామని, బీఆర్ఎస్ పాలనలో పరకాల ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు.
అలాగే గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో సీఎం కేసీఆర్ చొరవతో దేశంలోనే అతి పెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నిర్మించుకున్నామని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. గీసుకొండ మండలంలో రూ.38 కోట్లతో చేపట్టిన కోనాయిమాకుల ఎత్తిపోతల పథకం పూర్తయిందని, దీని ద్వారా పలు మండలాల్లో 18.5వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలని, సీఎం కేసీఆర్ పది కాలాల పాటు ఉంటేనే రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ఉండడమే గాక సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అభివృద్ధిని ఓర్వని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని కానీ ఆ పార్టీకే గ్యారెంటీ లేదని, స్కీముల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
విపక్షాల మాటలు నమ్మొద్దని, నమ్మి ఓటేస్తే పాత రోజులు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, లింగంపల్లి కిషన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, ఎంపీపీలు, జడ్పీటీసీలు సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, మచ్చ అనసూయ, కాగితాల శంకర్, బరిగె కల్పన, పోలీసు ధర్మారావు, కందగట్ల కళావతి, గూడ సుదర్శన్రెడ్డి, పరకాల, గూడెప్పాడ్ ఏఎంసీ చైర్మన్లు నిపానని హైమావతి, బొల్లెబోయిన రాధ, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మడికొండ శ్రీను, ధూరిశెట్టి చంద్రమౌళి, నేతాకుల సంజీవరెడ్డి, గుండు రాము, పసునూరి సారంగపాణి, వీరగోని రాజ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు చింతం సదానందం, బిల్లా రమణారెడ్డి, నేతాని శ్రీనివాస్రెడ్డి, బండి సారంగపాణి, బొజ్జం రమేశ్, సోదా రామకృష్ణ, రేగూరి విజయపాల్రెడ్డి పాల్గొన్నారు.