నల్లగొండ : పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు నల్లగొండకు చెందిన ఎన్నారైలు.. ఐటీ హబ్లో తమ కంపెనీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్లో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి రూ.95 కోట్లతో నల్లగొండకు ఐటీ హబ్ మంజూరు చేశారని తెలిపారు.
ఐటీ హబ్లో నియామకాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించగా 12 వేల మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
మొత్తం 3,600 మందికి అవకాశాలు వస్తాయన్నారు. ఇప్పటివరకు 15 కంపెనీలు వచ్చాయి. మొత్తం 50 కంపెనీలు భవిష్యత్తులో రానున్నాయని స్పష్టం చేశారు. నల్లగొండకు ఐటీ హబ్ కొత్త అందాన్నిచ్చి, మణిహారంలా నిలిచిందన్నారు.
గత కాంగ్రెస్ నాయకులు ఐటీ హబ్ తెస్తాం అని చెప్పి మాట తప్పారని విమర్శించారు. నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిచి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొన్నారు. నల్లగొండలో ప్రగతి ఆగకూడదంటే బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.