హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రవ్వంత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీకి అవుట్సోర్సింగ్గా రేవంత్ మారాడని విమర్శించారు. కాం గ్రెస్ పార్టీని హోల్సేల్గా బీజేపీకి తాకట్టు పెట్టడమే రేవంత్ అసలు లక్ష్యమని పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్పై, టీఆర్ఎస్పై రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం తప్ప రేవంత్కు మరో పని చేతకాదని ఎద్దేవాచేశారు. పెయింటర్రెడ్డి నుంచి పెయిడ్రెడ్డిగా రేవం త్ అవతారమెత్తారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే కేసులు వేసింది కాంగ్రెస్ నేతలేని గుర్తుచేశారు. ధాన్యం సేకరణపై బీజేపీ విధానానికి కాంగ్రెస్ పరోక్షంగా వత్తాసు పలుకుతున్నదని మండిపడ్డారు. రేవంత్ బీజేపీకి ఔట్ సోర్సింగ్ ఏజెంట్గా మారిపోయాడని ఆరోపించారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న రేవంత్ వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎందుకు వ్యతిరేకించటంలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అపహాస్యం చేసిన మకిలి చరిత్రను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పారు. సోనియాను తెలంగాణ బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ దేవత అని పేర్కొనటంలో ఆంతర్యం అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబుకు చెప్పులు మోసిన రేవంత్ ఇప్పుడు బీజేపీకి ఏజెంట్గా మారారని విమర్శించారు.
వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని హోల్సేల్గా బీజేపీకి తాకట్టుపెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.రేవంత్బారి నుంచి కాంగ్రెస్ను కాపాడుకోవాలని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదన్నారు. సొంతానికి ఆస్తులు కూడగట్టుకోవటం రేవంత్ అలవాటైతే.. రాష్ర్టానికి పెట్టుబడులు పెంచటమే మంత్రి కేటీఆర్ లక్ష్యమని చెప్పారు. తన ఏడు రోజుల అమెరికా పర్యటనలో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల పెట్టుబడి తెచ్చి గ్లోబల్ లీడర్ మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. మంత్రి కేటీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడన్నారు. తెలంగాణ ప్రగతికి ముల్లుగా మారిన రేవంత్ ఆటలు సాగనీయబోమన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు సహనంతో ఉన్నాయని, తానేమి చేసినా చెల్లుతుందన్నట్టు మాట్లాడుతున్న రేవంత్కు తగిన శాస్తి తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు. కేంద్రం వడ్లు కొనకపోతే ఉగాది తరువాత ఉగ్ర తెలంగాణను చూడాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అన్ని పాలకవర్గాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీర్మానాల యుద్ధం పూర్తి కావచ్చిందని, రాష్ట్రంలో రైతు ఉద్యమం తీవ్రం కాకముందే బీజేపీ కండ్లు తెరవాలని హితవు పలికారు.
రేవంత్ దౌర్భాగ్యపు ఎంపీ: ఎమ్మెల్సీ యెగ్గ్గె మల్లేశం
రేవంత్ వంటి దౌర్భాగ్యపు ఎంపీని తామెక్కడా చూడలేదని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరని ఇల్లు లేదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ముందుగా తన పార్టీలోని సీనియర్లకు సమాధానం చెప్పాలని ఆయన హితవు పలికారు. మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా వెళ్లారన్నారు. కేటీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడన్నారు. రేవంత్ వ్యవహారంతో కాంగ్రెస్కు ఒక్కసీటు కూడా రాదన్నారు. తన నియోజకవర్గాన్ని పట్టించుకోని రేవంత్ను ప్రజలే తరిమికొడతారన్నారు.
బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే వివేకానంద
రేవంత్రెడ్డి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో బీసీ కులగణన చేపట్టాలని పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అవహేళన చేసిన రేవంత్కు బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. విషయ పరిజ్ఞానం లేని రేవంత్ వ్యవహారాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, బెంగాల్ సహ అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయినట్టే రేపు తెలంగాణలోనూ అవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను ఖతం పట్టించటమే రేవంత్ ఉద్దేశమన్నారు. మూడేండ్లుగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ అక్కడి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.