MK Stalin : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (Delimitation) పై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు (Tamil Nadu) గళాన్ని వినిపించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
దేశం అభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా..? అని స్టాలిన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణ భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్టాలిన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కుట్రపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు పేరుతో పార్లమెంట్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం తగ్గించేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు.