Ashok Mittal : ఆమ్ ఆద్మీ పార్టీ నేత (AAP Leader), రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) అశోక్ కుమార్ మిట్టల్ (Ashok Kumar Mittal) నివాసం, వ్యాపార సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇవాళ ఉదయం ఏకకాలంలో సోదాలు (Raids) మొదలుపెట్టింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (FEMA) ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు (ED Officials) తెలిపారు. ఈ సోదాలపై వివరణాత్మక ప్రకటనను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
వ్యాపారవేత్త, విద్యావేత్త అయిన అశోక్ కుమార్ మిత్తల్ లవ్లీ గ్రూప్కు అధిపతిగా ఉన్నారు. ఈ గ్రూప్ ఒక యూనివర్సిటీ సహా పలు వ్యాపార సంస్థలను నడుపుతోంది. ఈ వ్యాపారాలకు సంబంధించి ఆయన ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంపైన, ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలపైన ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. అశోక్ మిత్తల్ రాజ్యసభలో ఆప్ ఉపనేతగా ఎన్నికైన కొన్ని రోజులకే ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తడానికి తమ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా భయపడుతున్నారనే కారణంతో ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను రాజ్యసభలో తమ పార్టీ ఉపనేత స్థానం నుంచి తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్ను నియమించింది. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జలంధర్, చండీగఢ్ విభాగాలకు చెందిన ఈడీ అధికారులు ఈ సోదాల్లో పొల్గొన్నారు.