క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. మూడు మ్యాచ్లాడినా బోణీ కొట్టలేకపోయింది. ఏకైక టీ20లో పరాజయం పాలైన భారత్.. వన్డే సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో మిథాలీ బృందం 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (66 నాటౌట్) వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్సెంచరీతో రాణించగా.. రిచా ఘోష్ (65), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (49) సత్తాచాటారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అమెలియా కెర్ (119 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. మ్యాడీ గ్రీన్ (52) ఆమెకు అండగా నిలిచింది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి అందుబాటులో లేకపోవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. దీప్తి శర్మ (4/52) వి కెట్లు పడగొట్టినా.. మిగిలిన బౌలర్లు ప్రత్యర్థిపై ఒ త్తిడి పెంచడంలో విఫలమయ్యారు.
మందనఈజ్ బ్యాక్
క్రైస్ట్చర్చ్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత మహిళల జట్టుకు శుభవార్త. క్వారంటైన్ నిబంధనల కారణంగా న్యూజిలాండ్తో ఏకైక టీ20తో పాటు, వన్డే సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరమైన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన జట్టుతో చేరింది. మంగళవారం క్రైస్ట్చర్చ్లో క్వారంటైన్ ముగించుకున్న మందన సిరీస్ జరుగుతున్న క్వీన్స్టౌన్కు చేరుకుంది. ‘హమ్మయ్య! క్వారంటైన్ ముగిసింది. జట్టుతో చేరేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’ అని మందన సామాజిక మాద్యమాల్లో వెల్లడించింది. స్మృతితో పాటు పేసర్లు మేఘన సింగ్, రేణుక సింగ్ కూడా జట్టుతో కలిశారు.