ఆలేరు టౌన్ : యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసలై కొందరు పెడదోవ పడుతున్నారు. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని కష్టపడుతున్నారు. మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్ఫోన్లకు, మందుకు, డ్రగ్స్కు అలవాటై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో మత్తువైపునకు వెళుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం కూడా పట్టించుకోక పోవడంతో విద్యార్థుల గతి తప్పుతుంది.
సెల్ఫోన్లు, బైక్లు
నేడు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఫోన్ చేతిలో ఉంటే సమస్తం ఉన్నట్లే. సెల్ఫోన్ కొనివ్వలేదని కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఒక కారణమైంది. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల చదువుల పేరిట సెల్ఫోన్ వాడడం సాధారణమైంది. అంతే కాకుండా స్మార్టుఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల మోజులో పడి నీలి చిత్రాలకు ఆకర్షితులవుతున్నారు. సినిమాలు, సెల్ఫోన్ల వినియోగంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇంటర్లోనే మందు కొడుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఆపై స్థాయి విద్యలో చెడు అలవాట్లకు బానిస చేస్తుంది. అంతే కాకుండా కొన్నిచోట్ల సంపన్న వర్గాల పిల్లలకు స్పోర్ట్సు బైక్లు, కారులు, చేతి నిండా సొమ్ము ఉండడంతో వినోదాన్ని హద్దులు దాటేస్తున్నారు. మరికొన్ని చోట్ల రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. అలాగే గంజాయి సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. యాదాద్రి జిల్లాలో కూడా యువత వీటికి అలవాటు అవుతున్నారు. కొన్నిచోట్ల మద్యానికి బానిసైన వారు డబ్బులు లేకపోవడంతో హత్యలకు పాల్పడుతున్నారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు.
గుర్తించకపోతే ముప్పే
చెడుబాట పడుతున్నట్లుగా గుర్తించాల్సింది తల్లిదండ్రులే. విద్యార్థి దశలో చెడు స్నేహాలతో సిగరెట్, మందుకు అలవాటు పడిన వారు మత్తు పదార్థాల వైపు ఖచ్చితంగా వెళ్తారు. వారిని గుర్తించాలి. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుంటే చాలామంది డిప్రేషన్లోకి వెళ్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు గుర్తించాలి. చదువులో వెనకబడడం, పరీక్షలు బాగా రాయకపోవడం, ఒంటరిగా ఉండడం, ప్రవర్తనలో మార్పు, ఆలస్యంగా నిద్ర పోవడం, సెల్ఫోన్తో గడపడం, అబద్దాలడడం వంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు గుర్తించాలి. వారిపై ఒక కన్నేసి చూడాలి. గంజాయి తాగే వారి కండ్లు ఎరుపుగా ఉంటాయి. వారిని గుర్తించాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండకుండా చూడాలి. కాసేపు మనసు విప్పి వారితో మాట్లాడాలి. పిల్లలకు అతిస్వేచ్ఛ ఇవ్వవద్దు. పిల్లలకు ఇష్టారీతిన పాకెట్ మనీ ఇవ్వవద్దు.
నైతిక విలువలకు ప్రాధాన్యం
నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కెరీర్పై దృష్టి సారించేలా చూడాలి. మానవత్వం గురించి వివరించాలి. సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదాలు, షికార్లే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రలోభాలకు గురి కాకుండా ఒక కన్నేసి చూడాలి. కళాశాలల యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి.