ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఇటీవలే ముగిసిన సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్కు ముందు కీలక ఆటగాళ్లను దూరం చేసుకున్న ముంబైకి ఈసారి పలువురు కొత్త కుర్రాళ్లు భావితారలుగా అవతరించారు. వారిలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఒకడు. క్రికెట్ ప్రాణంగా బ్రతికిన కార్తికేయ.. 15 ఏళ్ల వయసులో ఇంట్లోంచి బయటకు వచ్చిన తొమ్మిదేండ్లకు తన తల్లిని కలిశాడు.
ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి భారం కాకూడదని భావించిన కార్తికేయ.. 15 ఏళ్ల వయసులోనే ఇంటి (మధ్యప్రదేశ్) నుంచి బయటకు వచ్చాడు. ముంబైకి చేరి అక్కడ దొరికిన పనిచేశాడు. ముంబైలో ఓ ఫ్యాక్టరీలో పనిచేశాడు. మధ్యాహ్నం పూట అన్నం తింటే రూ. 10 ఖర్చు చేయాల్సి వస్తుందని ఏడాది పాటు లంచ్ కూడా మానేశాడు. కొంచెం ఆర్థికంగా కుదురుకున్నాక తనకు ఇష్టమైన క్రికెట్లో తానేంటో నిరూపించుకుని 2018లో మధ్యప్రదేశ్ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు.
2022 ఐపీఎల్ వేలంలో కార్తికేయను ముంబై జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ముంబై తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించాడు. ఐపీఎల్ సందర్భంగా మాట్లాడుతూ.. తాను 9 ఏండ్లుగా ఇంటికి వెళ్లలేదని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అతడు.. సుదీర్ఘ విరామానికి చెక్ పెడుతూ తల్లిని కలిశాడు.
ఈ మేరకు కార్తికేయ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపాడు. ‘9 ఏళ్ల 3 నెలల తర్వాత అమ్మను, నా కుటుంబాన్ని కలిశాను. నా ఫీలింగ్స్ను వెల్లడించడానికి మాటలు రావడం లేదు..’అని ట్వీట్లో పేర్కొన్నాడు.