వేల్పూర్, డిసెంబర్ 8: సొంత జాగా ఉన్నవాళ్లకు ఇండ్లు కట్టించే పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని తన సొంత గ్రామమైన వేల్పూర్లో రూ.7 కోట్లతో నిర్మించిన 112 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి, వారితో గృహప్రవేశాలు చేయించారు. ఈ గృహ సముదాయానికి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఇండ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇండ్లు లేని వారు ఉండే వారు కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కాగితాలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్న వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. 22 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పేద వారి కోసం ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారా? అని ప్రశ్నించారు. పేదల సంక్షేమానికి ఇంతగా పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.