హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ (PPT) ద్వారా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. జలదోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్పైకి పోలీసులను పంపిందని, రోజులకు 3 టీఎంసీల చొప్పున నీటిని అక్రమంగా తలరించుకుపోయిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదన్నారు. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉందని చెప్పారు. 512 : 299 టీఎంసీల కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తున్నదని విమర్శించారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో 203 జారీ చేసింది. దీనిద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించారని నిర్ణయించిందన్నారు. 797 అడుగుల వద్ద నీటి తరలింపునకు ఏపీ సర్కారు జీవో ఇచ్చిందని తెలిపారు.
1987లో పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తరలించేంది. 2005లో దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం 92,592 క్యూసెక్కులకు పెంచుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీలు తరలిస్తుందని చెప్పారు. 2013లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదలైనా.. ఇప్పటికీ పూర్తిచేయలేదని విమర్శించారు.