మేళ్లచెర్వు, జనవరి 14 : హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన లిఫ్ట్లకు మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్శర్మ మంత్రిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమం తప్పక అమలు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ సుమారు 14 ఎంపీ స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటుందని ఆయన విమర్శించారు. మందిర నిర్మాణం పూర్తి కాకుండానే పీఠాధిపతులు సరికాదని చెప్పినా ప్రారంభించాలనుకోవడం దారుణమన్నారు. ఆయన వెంట నాయకులు భాస్కర్రెడ్డి, సైదేశ్వర్రావు, గోవిందరెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, వీరారెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ఉన్నారు.