హైదరాబాద్ : పేదలు గొప్పగా బతకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో వెయ్యి మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభ్యత్వమే అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. నగరంలో పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తుంది. దశల వారీగా అర్హులైన పేదలందరికి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇండ్లను కేటాయిస్తాం.
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. మొదటి విడతలో 11,700 మందికి ఇండ్లు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రోండో విడతలో 13,200 మందికి ఇండ్లు కేటాయిం చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.