హైదరాబాద్ : మహబూబాబాద్ను ఆదర్శ జిల్లాగా, మాతాశిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పోషణమాసం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా టీకాలు, మందులు ఎలా వేసుకోవాలో చైతన్యం కల్పించడమే పోషణ మాసం ఉద్దేశమని తెలిపారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఏం తింటున్నారు? ఏం తినాలి? అని గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
తెలంగాణ స్వరాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజలు, ముఖ్యంగా మహిళలపై మనసుపెట్టి ఆలోచించే సీఎం కేసీఆర్ దొరకడం మన అదృష్టమన్నారు. తెలంగాణలో మహిళలు, చిన్నారుల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రోత్ మానిటరింగ్ కార్డ్ దేశానికే రోల్మోడల్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. మహిళల పేరుమీదే ఇండ్ల పట్టాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్కార్డులు, పెన్షన్లు ఇస్తున్నారన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దని తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయన్నారు. పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం ఎంతో తోడ్పాటుగా ఉంటుందన్నారు. గర్భిణులకు అంగన్వాడీల్లో పోషకాహారం అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ.12వేలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. దీంతో మాతా, శిశు మరణాలు తగ్గాయన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 24శాతంగా ఉండగా.. రాష్ట్రం వచ్చాక చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో 55 నుంచి 60 శాతానికి పెరిగాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 12 మెడికల్ కాలేజీలతో ప్రస్తుతం నడుస్తున్న జిల్లా ఏరియా హాస్పిటల్స్ మాతాశిశు ప్రభుత్వ దవాఖానాలుగా మార్చడంతో మరణాలు మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాంమోహన్రెడ్డి, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.