హైదరాబాద్: ఈ దేశంలో రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి బాసటగా నిలిచే ఏకైక నేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయం మరోసారి నేడు స్పష్టమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక నల్లచట్టాల రద్దు చేయించే పోరాటంలో అమరులైన రైతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం పట్ల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినట్లు కేంద్రం కూడా ఈ రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించాలని, అలాగైనా రైతుల పట్ల తన చిత్తశుద్ధిని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసులను, సోషల్ మీడియా వేదికగా స్పందించిన వారిపై పెట్టిన కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన డిమాండ్పై కేంద్రం వెంటనే స్పందించాలన్నారు.
లేనిపక్షంలో ఈ కేసుల ఉపసంహరణ కోసం కేంద్రం మెడలు వంచడానికి మరోపోరాటం చేయాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో వానాకాలంలో తెలంగాణ రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తానని చెప్పడం ద్వారా రైతుల ఆందోళనను సంపూర్ణంగా తొలగించి, భరోసా కల్పించినందుకు రైతుల పక్షాన మరోసారి సీఎంకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ మేరకు షరతులు లేకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల మెడమీద కత్తిపెట్టే విధంగా తీసుకొచ్చిన విద్యుత్ చట్టాలను వెంటనే వాపస్ తీసుకోవాలన్నారు.
రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్న తీరుకు చరమగీతం పాడి, వెంటనే నీటి వాటాలను తేల్చాలని కూడా మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఇవన్నీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే అమలు చేసి కేంద్రం తాను వ్యవసాయ చట్టాలపై చేసిన రద్దు ప్రకటన పట్ల, రైతుల పట్ల తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలన్నారు. ఇకనైనా బీజేపీ రాష్ట్ర నేతలు తమ చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు.