హైదరాబాద్, జనవరి 31 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోయ కళాకారుడు రామచంద్రయ్యను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనం గా సన్మానించింది. హైదరాబాద్ మాసబ్ట్యాంక్ వద్ద ఉన్న గిరిజన మ్యూజియం ప్రాంగణంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్చోంగ్తూ తదితరులు ఆయనను పట్టువస్ర్తాలు, శాలువాతో సత్కరించారు. లక్ష నగదును బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. గతేడాది గుస్సాడి కళాకారుడు కనకరాజు, ఈ ఏడాది రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషకరమని చెప్పారు. రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంస్కృతికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులకు అత్యంత గౌరవం ఇస్తున్నార ని చెప్పారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ, గిరిజన ఆణిముత్యాలకు సముచిత గౌరవం ఇస్తున్నదని, రామచంద్రయ్య, మొగిలయ్య వంటి అరుదైన కళాకారులకు పద్మశ్రీ అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేయటం సీఎం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి కళాకారులకు నెలకు రూ.10 వేల పింఛన్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధించిన తరువాతే కనుమరుగు అవుతున్న కళలు, జాతులను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు.అరుదైన కళలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. ఆదివాసీ గిరిజన కళల్ని ప్రోత్సహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కొడుకు బాబూరావు, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్రెడ్డి, మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ, జేడీ కల్యాణ్రెడ్డి, సీతారాంనాయక్, శంకర్రావు, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
సమ్మక్క చలవతోనే పద్మశ్రీ అవార్డు
ఎకడో కోయజాతిలో పుట్టిన నాకు పద్మశ్రీ అవార్డు రావడం సమ్మక్క చలవే. మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెప్తుంటాను. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. కోయ జాతిని, కళాకారులను మంచిగా చూసుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పదివేల నమస్కారాలు. ప్రోత్సహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరికీ నమస్కారాలు.
– పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య