హైదరాబాద్ : సోమవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం ఆదివాసిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ జాతరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి అనేక పథకాలను సీఎం కేసీఆర్ స్వయంగా పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక వేష, భాష, నృత్యాలు, జీవన విధానంతో జాతరలను, పండగలను భక్తితో నిర్వహించుకునే ఆదివాసిల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా గోండు జంగుబాయి జాతర, నాగోబా జాతర, గాంధారి మైసమ్మ జాతర, చెంచు భోరాపూర్, లంబాడీ సేవాలాల్ జయంతి, పూలాజీ బాబా జయంతి, సిరాల్ లక్ష్మీదేవర, భీమాయక్ పండగల కోసం దాదాపు రూ.1.25 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా అత్యంత ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఈ జాతర నిర్వహణ కోసం కోట్ల రూపాయలను వెచ్చించి ఆదివాసీల జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదీవాసిలను కూడా పారిశ్రామిక వేత్తలు చేయాలని తీసుకొచ్చిన సీఎంఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ప్రతిష్టాత్మక పథకం ద్వారా నేడు ప్రత్యేకంగా గోండులు, కోయలు, ఎరుకల ఇతర ఆదిమ గిరిజన తెగలకు సంబంధించిన వారుకూడా పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రంలో మారబోతున్నారన్నారు.
ఈ విషయాన్ని ఆదివాసి దినోత్సవం సందర్భంగా చెబుతుండడం సంతోషంగా ఉందన్నారు. 69 మంది గిరిజన లబ్దిదారులకు చెందిన రూ.84.89 కోట్ల ప్రతిపాదనలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందులో రూ.29.71 కోట్ల సబ్సిడీ రూపంలో, రూ.46.68 కోట్లు బ్యాంకు రుణం, రూ.8.48 కోట్లు లబ్ధిదారుల వాటా ధనం రూపంలో అందించడం జరుగుతుందన్నారు. మరో 12 ప్రతిపాదనలు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.