కందుకూరు, నవంబర్ 15 :సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని మహేశ్వరం అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని దావుద్గూడ, పెద్దమ్మతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, బాచుపల్లి, జైత్వారం, కొత్తగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ… గడచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చేశానని, తనను మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముచ్చర్ల గేటు వరకు మెట్రోను తీసుకొస్తానని , మెడికల్ కళాశాలను పూర్తి చేస్తానని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి జరుగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు. జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.