వనపర్తి : వందేళ్లయినా సాగునీటికి ఢోకా లేదు.. చివరి ఎకరా వరకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకుదెరువుకు భరోసానిచ్చారు అని తెలిపారు.
వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వైద్యఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ వాకాటి కరుణ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , డీఎమ్ఈ రమేష్ రెడ్డి, కలెక్టర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 330 పడకలతో వనపర్తి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ అశీస్సులు, హరీష్ రావు సహకారంతో వనపర్తి పచ్చబడింది అని పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆర్థికం హరీష్ రావు చేతుల్లో ఉన్నాయి. వనపర్తి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.