యాసంగి ధాన్యం కొననంటరు.. పోనీ వానకాలం ధాన్యం మొత్తం కొంటమని రాసిమ్మంటే.. రెండు రోజుల్లో చెప్తామన్న మాయల మారి కేంద్ర మంత్రి గోయల్ పత్తాలేకుండా పోయారు. ఆరు రోజులుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో పడిగాపులు కాస్తుంటే.. పనీపాటా లేదా అని అవమానిస్తరు. కిందామీదా పడి కేంద్ర మంత్రిని కలిస్తే.. యాసంగిపై పూర్తిగా చేతులు ఎత్తేస్తరు.. వానకాలం పంట ఎంతొస్తే అంత కొంటామంటూ మీడియా ముందు పదే పదే ప్రకటనలు చేస్తరు. ఆ ముక్కేదో కాగితం మీద రాసివ్వండని అడిగితే.. రెండురోజుల్లో చెప్తమంటరు.. పోనీ ఏడాదికి ఎంత ధాన్యం కొంటరో చెప్పాలని కోరితే.. అబ్బే ఇప్పుడు కాదు. పంట కోతల టైంలో డిసైడ్ చేద్దమంటరు.. వీళ్లను నమ్ముకొని రైతులు వ్యవసాయం చేయాలా?
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘మేం రైతుల సమస్యలపై ఢిల్లీకి వచ్చి ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే మీకు తమాషాగా ఉన్నదా? ఎందుకొచ్చారని అవమానిస్తరా? మాకేమీ పనీపాట లేదా.. మేమేమైనా మీతో లవ్వాడనీకి వచ్చినమా.. మీకు ప్రేమ లేఖలు రాయనీకి వచ్చినమా?’ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
గురువారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. వానకాలంలో మిగిలిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాతపూర్వక హామీపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టతనిస్తామన్న కేంద్రమంత్రి ఇప్పటి వరకు ఎందుకు చెప్పటంలేదని నిలదీశారు. వానకాలం పంట ఎంతైనా తీసుకొంటామని చెప్పిన కేంద్రమంత్రి గోయల్ అదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వడానికి అడ్డంకేమిటని ప్రశ్నించారు. రైతుల విషయంలో తుచ్ఛమైన రాజకీయాలు తమకు అవసరం లేదని, ఏదో ఒకటి తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా ఫక్తు రాజకీయ పార్టీలా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు. తాము పనీపాటా లేకుండా వచ్చినట్టు అవమానిస్తున్నారన్న మంత్రి.. రైతుల సమస్యలంటే కేంద్రానికి అంత చులకనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి నచ్చిన కార్పొరేట్ల కోసం ఎంత దూరమైనా పోయి ఒప్పందాలు చేయిస్తారని, రైతుల సమస్యలపై మాత్రం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు ఆకలితో ఏడ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అధిక ఉత్పత్తులను రైతులు పండిస్తుంటే.. కేంద్ర నాయకత్వం వైఫల్యంతో ఆ పంటను అమ్ముకోలేక తెలంగాణ రైతాంగం బాధపడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
ఎన్నికల హామీలు ఏమైనయి?
ఎన్నికలకు ముందు ఎమ్మెస్పీపై స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఏడేండ్లు గడిచినా ఎందుకు అమలు చేయలేదని మంత్రి నిరంజన్రెడ్డి నిలదీశారు. దేశంలో 51 రకాల పంటలు పండిస్తుంటే కేంద్రం 14-23 పంటలకు మాత్రమే ఎమ్మెస్పీ ఇస్తున్నదని, అది కూడా నామమాత్రమేనని తెలిపారు.
స్వామినాథన్ సూచించిన సీ2 + 50 ఫార్ములా ప్రకారం ఎమ్మెస్పీ అమలు చేస్తే కేంద్రంపై ప్రతి ఏటా 2.28 లక్షల కోట్ల భారం పడుతుందని, ఇది దేశ బడ్జెట్లో 7-8 శాతమేనన్నారు. రైతుల సంక్షేమంకోసం కేంద్రం ఈ మాత్రం కూడా భరించలేదా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన దాంతో పోల్చితే రైతులకు ఇచ్చేది పెద్దదేమీ కాదన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, కమిటీలు, కమిషన్ల నివేదికల ప్రకారం ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం పంట విలువలో 25% సబ్సిడీలుగా ఇస్తుంటే మన దేశంలో ఇచ్చేది 4% మాత్రమేనని చెప్పారు. పాలన చేతకాకుంటే.. ధాన్యం కొనే సత్తా లేకుంటే అసమర్థతను ఒప్పుకొని ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మెరుగైన వ్యవసాయ విధానం అమలుకావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
వ్యవసాయాన్ని బంద్ పెడతరా?
‘పంటలకు మద్దతు ఇవ్వరు.. పండించిన పంటలను కొనరు. ఇంతకీ దేశంలో వ్యవసాయాన్ని బంద్ పెడతరా?’ అని మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కొత్త తరాన్ని సేద్యంవైపు తేవాలని తెలంగాణ ప్రయత్నిస్తుంటే, కేంద్రం.. ఉన్నవాళ్లనే వెళ్లిపోయేలా చేస్తున్నదని వాపోయారు. ఈ ఏడేండ్లలో తెలంగాణ.. వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. కేంద్రం తిరోగమనంలో నడిపిస్తున్నదని మండిపడ్డారు.
రైతులకు మేలుచేయడమే మా తప్పా?
దేశంలో ఎక్కడా లేని సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని కొందరు సన్నాసులు అంటున్నారన్న నిరంజన్రెడ్డి.. వారు కొంచెం జ్ఞానం తెచ్చుకొని మాట్లాడాలని హితవు పలికారు. యాసంగిలో వరి పండే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తుచేశారు. వానకాలంలో తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి పండితే.. ఏపీలో 38 లక్షల ఎకరాల్లో మాత్రమే పండిందని తెలిపారు. ఎక్కువ ధాన్యం పండిస్తున్నది కాబట్టే ఈ సమస్య వచ్చిందని, కేంద్రం మొద్దు నిద్రపోతున్నందునే దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. కేంద్రానికి ఓ విధానం లేకపోవడం సమస్యకు కారణమని తెలిపారు.
బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులు పంట పండించడం తప్పా? ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం తప్పా? కరెంటు ఇవ్వడం తప్పా? బీడుపడ్డ భూములకు నీళ్లు ఇవ్వడం తప్పా? వలసలు పోయిన వారిని వెనక్కి తీసుకురావడం తప్పా? ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ముందుగా డబ్బులు ఇవ్వడమే తెలంగాణ చేసిన తప్పా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డగా కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రైతుల సమస్యను పరిష్కరించే బాధ్యత లేదా? అని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల దుష్ట పన్నాగాలను, కపట నాటకాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, తగిన సమయంలో బుద్ధి చెప్తుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మంత్రులు ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ నేతకాని పాల్గొన్నారు.
తాతల కాన్నుంచి వరినే ఎత్తానం
మా తాతతండ్రుల కాన్నుంచి వరినే ఎత్తానం. ఉన్నపలంగా ఢిల్లీలోని బీజేపోళ్లు యాసంగి వడ్లు కొనమని మొండికేత్తె మా బతుకెట్ల. రైతును ఏడిపిత్తే అరిష్టం. గప్పట్ల కొన్నరు.. ఇప్పుడెందుకు కొనరు. మొన్నటిదాక నీళ్లు లేక అరిగోస పడ్డం. గిప్పుడు తెలంగాణ వచ్చినంక చెర్వుల ఫుల్లు నీళ్లున్నయ్. ఇప్పుడు జూత్తె కేంద్రం గిట్ల కొర్రీలు పెడుతుంది. మా ఉసురు తాకుద్ది. రైతుల కోసం గిక్కడి మంత్రులు ఢిల్లీలో కొట్లాడుతుంటే ఎటకారం చేస్తున్రు. సీఎం కేసీఆర్ వెంట రైతులు ఉన్నరని గుర్తుజేస్తున్న.
నరిగె రవి, రైతు, అంకుసాపూర్, మం: కాటారం, జిల్లా: జయశంకర్ భూపాలపల్లి
రైతులను బజారుకీడుస్తారా?
సీఎం కేసీఆర్ సార్ తన అప్వూర ఆలోచనలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నెర్రెలు బారిన నేలలో సిరులు కురిపిస్తుంటే కేంద్రం ఓర్వలేకపోతున్నది. వ్యవసాయాభివృద్ధిని, రైతుల ఎదుగుదలను చూడలేక వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులను బజారుకీడ్చే పని పెట్టుకున్నది. ఎన్నడూ లేనివిధంగా వరి కొనేదిలేదని ఇబ్బందులకు గురిచేయడం కుట్రలో భాగమే. రైతులను బాధపెట్టిన ప్రభుత్వాలు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు.
ధరావత్ బాబ్జీ, మంగళితండా, మం:కోదాడ, జిల్లా: సూర్యాపేట