మేడ్చల్, హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుమూల పల్లె నుంచి రాజధాని నగరం దాకా విపక్షాల పునాదులు సడలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా శ్లాఘిస్తూ గులాబీ బాట పడుతున్నారు. కొన్ని రోజులుగా గులాబీ నీడకు చేరుతున్న నేతలు, కార్యకర్తల సంఖ్య ఎక్కువవుతున్నది. కాంగ్రెస్, బీజేపీ తీరు నచ్చని మారుమూల ప్రాంతాల్లో కార్యకర్తలు మొదలుకొని ఓ స్థాయి పట్టణ నాయకుడి దాకా గులాబీ కండువా కప్పుకొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. తరాలుగా కాంగ్రెస్తో అనుబంధం ఉన్న కుటుంబాలు కూడా సీఎం కేసీఆర్ పాలన నచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా మరోపార్టీకి అవకాశం లేదని, టీఆర్ఎస్ ప్రజాబలం ముందు మరేపార్టీ నిలవలేదని గ్రహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల, జిల్లా స్థాయి నాయకులు కూడా వరుసబెట్టి కారెక్కుతున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని తామెన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి నచ్చక ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు చెప్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్, రాహుల్గాంధీ కూడా బీజేపీకి పరోక్షంగా వంతపాడుతున్నారని క్షేత్రస్థాయి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్పై విమర్శలు చేయటాన్ని తట్టుకోలేక.. ఆ పార్టీలకు గుడ్బై చెప్తున్నారు.
వెల్లువలా చేరికలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఇతర పార్టీల నేతలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కరీంనగర్లో పర్యటించిన సందర్భంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు మొండి శ్రీలత చంద్రశేఖర్, నక్క పద్మ కృష్ణ టీఆర్ఎస్లో చేరారు. పొద్దునలేస్తే టీఆర్ఎస్పై, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఒంటికాలిపై లేచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార సరళి నచ్చక టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ కార్పొరేటర్ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్మ గంగారెడ్డి సహా పదుల సంఖ్యలో ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ సమక్షంలో, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీని వీడి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి వందల మంది గులాబీ కండువా కప్పుకొంటున్నారు.
రాహుల్ అట్టర్ ఫ్లాప్ నాయకుడు: మల్లారెడ్డి
– 200 మంది టీఆర్ఎస్లోకి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అట్టర్ ఫ్లాప్ నాయకుడిగా గుర్తింపు పొందారని మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగైపోయిందని అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరకు చెందిన కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, పార్టీ గ్రామ అధ్యక్షుడితో కలిసి మొత్తం 200 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుమ్ములాటలు తప్ప ప్రజల అభివృద్ధి కాంగ్రెస్కు ఏనాడూ పట్టదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఆ పార్టీకి అడ్రస్ లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు.
రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను తిరగనివ్వని రోజులు దగ్గరపడ్డాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పుకొంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, డాక్టర్ భద్రారెడ్డి, కీసర మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.