యాదాద్రి భువనగిరి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలను బ్రహ్మాండంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని, ఎన్నో సంక్షేమ అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకనాడు తాగునీటికి గోసపడ్డ ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు మిషన్ భగీరథ జలాలతో శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. ఇంటి ముందే నల్లా పెట్టి, ఆడబిడ్డల కష్టాలను దూరం చేశామని గుర్తుచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, గట్టుప్పల్లో శుక్రవారం దాదాపు రూ.50కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నాలుగైదు నెలల్లో చండూరును అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్ల ద్వారా సాగు నీరందిస్తామన్నారు.
మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే కూసుకుంట్ల గెలుపు అనంతరం రెండోసారి నియోజకవర్గానికి వచ్చానని తెలిపారు. ఉత్త చేతులతో వచ్చి.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోవడం లేదని, మొదటిసారి వచ్చినప్పుడు శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేశామని, ఇప్పుడు చండూరులో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. ఫ్లోరైడ్ బాధితురాలు, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమకారిణి తిరుపతమ్మకు ఇంటి నిర్మాణం కోసం రూ.5.4లక్షల చెక్కును అందజేశారు. అంతకుముందు హుజూర్నగర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రి, ఎస్టీఓ ఆఫీసును ప్రారంభించారు. నియోజకవర్గానికి సంబంధించిన కోట్లాది రూపాయల పనులు, బస్తీ దవాఖానలకు మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలను బ్రహ్మాండంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీలో రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చండూరు పట్టణానికి ఓ సుదినమని, రూ.40కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడు చండూరు రోడ్లు చూస్తే ఏం బాగోలేవని, అప్పుడే అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నామని అన్నారు. మునుగోడును దత్తత తీసుకుంటామని ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పానని, ఆ మేరకు ఇప్పటికే రెండోసారి నియోజకవర్గానికి వచ్చానని తెలిపారు. ఉత్త చేతులతో వచ్చి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోవడంలేదన్నారు. మొదట సారి వచ్చినప్పుడు సుదీర్ఘంగా శాఖలవారీగా సమీక్ష చేశామని, ఇప్పుడు చండూరులో రూ. 40 కోట్లతో శంకుస్థాపనలు చేసినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం
గతంలో 29లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు 46లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్ను రూ. 2,016కు పెంచిందని తెలిపారు. వృద్ధులకు మాత్రమే కాకకుండా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరిమహిళలు, బీడి, గీత, నేత కార్మికులకు పింఛన్ అందుతున్నదని వివరించారు. గతంలో ఏడాడికి రూ. 800 కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఏటా రూ.11వేల కోట్లు ఖర్చు అవుతున్నదని తెలిపారు. పేదవాడి ముఖంలో చిరునవ్వులేకపోతే ఆ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వమని సీఎం కేసీఆర్ నమ్ముతారని, పేదలను సంతోష పెట్టడమే ముఖ్యమైన ఉద్దేశమని ఆయన ఎప్పుడూ చెబుతారని గుర్తు చేశారు. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి చెక్కు ఇంటికి తెచ్చి ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో తెలంగాణ సర్కారు మాత్రమేనని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ కింద ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
మాటిస్తే మడమతిప్పని నేత కేటీఆర్ ; ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులతో సమీక్ష చేసిన మంత్రి కేటీఆర్ చండూరుకు రూ. 30 కోట్లు ఇస్తామని చెప్పారని, మాట ఇస్తే మడమతిప్పని నాయకుడిగా, తండ్రికి తగిన తనయుడిగా నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు అభివద్ధిలో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ప్రజలు నిజంగా అదృష్టవంతులని, గతంలో ఇచ్చిన రూ.10 కోట్లతో కలిపి మొత్తం రూ.40 కోట్లతో శంకుస్థాపనలు చేశారని కొనియాడారు. చండూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్, భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న పాల్గొన్నారు.
గత పాలకుల హయాంలో అనాథగా మునుగోడు
“మాది ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా మారిపోయే ప్రభుత్వం కాదు. ఎన్నికల తర్వాతైనా చెప్పిన మాటను నిలబెట్టుకునే దిశగా పనిచేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. ఎన్నికలప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే.. ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటాం. అండగా ఉండాలని కోరుకుంటాం. ప్రజలు ఆశీర్వదిస్తే డబుల్ స్పీడ్తో పనిచేస్తాం. గతంలో పనిచేసినోళ్లు నియోజకవర్గాన్ని అనాథగా చేశారు. కనీసం పట్టించుకోలేదు. అలాంటిని ప్రభాకర్ రెడ్డి 60రోజుల్లో అంతా తిరుగుతూ అభివృద్ధి చేస్తున్నారు..” అని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ. 90 కోట్లతో చండూరు నుంచి కొండమల్లేపల్లి వరకు రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చండూరులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత శ్రద్ధ పెట్టి, దూర దృష్టితో పనిచేయలేదని తెలిపారు.
ఫ్లోరైడ్ బాధితురాలు తిరుపతమ్మకు మంత్రి కేటీఆర్ సాయం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితురాలి పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితురాలు, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమకారురాలు తిరుతమ్మను మంత్రి కేటీఆర్ అక్కున చేర్చుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేయడానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం చండూరు మండల కేంద్రానికి వచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతమ్మకు ఇంటి నిర్మాణానికి కావాల్సిన రూ.5.4లక్షల చెక్కును ఆమె అందజేశారు. గతంలో శివన్నగూడెం గ్రామానికి ఫ్లోరోసిస్ బాధితుడు, ఉద్యమకారుడు అంశల స్వామికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఇచ్చారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై స్వామి కుటుంబ సభ్యులతో కలిసి సామాన్యుడిలా భోజనం చేసిన విషయం తెలిసిందే. అడుగగానే సహాయం చేసిన మంత్రి కేటీఆర్ సార్కు రుణపడి ఉంటానని తిరుపతమ్మ భావోద్వేగానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫ్లోరైడ్ మహమ్మారి పోయిందని, కేసీఆర్ సార్ ఫ్లోరైడ్ బాధితులకు ఎంతో మేలు చేస్తున్నారని వెల్లడించింది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్ మాట్లాడుతూ తిరుపతమ్మకు సహాయమందించి మరోసారి ఫ్లోరైడ్ బాధితుల పట్ల మంత్రి కేటీఆర్ తన ప్రేమను చాటుకున్నారన్నారు.
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్య ఖతం
గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నీళ్లకు అలమటించిందని, పక్కన కృష్ణానది ఉన్నా తాగునీటి కోసం గోస పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫ్లోరైడ్తో జిల్లా బిడ్డల బొక్కలు వంకరపోయిన పరిస్థితి ఉండేదని, ఇయ్యాల కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చి ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా తుడిచిపెట్టారని గుర్తు చేశారు. 65 ఏండ్లలో పరిష్కారం కాని సమస్యను ఎనిమిదేండ్లలో తీర్చారని తెలిపారు. ఈ ప్రాంతంలో లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్ల ద్వారా సాగు నీటి సమస్య కూడా కేసీఆర్ పాలనలో తప్పకుండా పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు.