రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి కేటీఆర్కు మద్దతు ఇచ్చేందుకు సంఘాలన్నీ ముందుకొస్తున్నాయి. ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతోపాటు, ఇక్కడి నేతన్నల బతుకు చిత్రం మార్చారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో 22 సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కాపీలను ఆయా సంఘాల అధ్యక్షులు కేటీఆర్కు అందజేశారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది. ఇందులో 18 కులసంఘాలు కాగా, 4 వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ సంఘాల అధ్యక్షులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సీఎం కేసీఆర్కు పరిచయం చేశారు.