పట్టణాల్లో ఒకరోజు ఉపాధి దొరక్కపోతే జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్నటువంటి వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇవ్వాలి. ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం మాదిరిగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలి. వారికి నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమంవంటి చర్యలను ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలి.
-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 27 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) తరహాలో దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనను రానున్న బడ్జెట్ సమావేశాల్లో పరిశీలించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు. పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పునకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సవివరమైన సూచనలను ఈ లేఖలో మంత్రి ప్రస్తావించారు. పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ అని, దీనికి భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదని స్పష్టంచేశారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాల వైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశమున్నదని పేర్కొన్నారు.
పట్టణ పేదరికంపై దృష్టి సారించాలి
2011 జనాభా లెకల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉన్నదని, 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉండబోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు వలస వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికంపై దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. పట్టణ పేదలకు అవసరమైన గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధి వంటి అంశాలపైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. పట్టణ పేదలకు సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని గడిపే అవకాశముంటుందన్నారు.
అత్యధికులు అసంఘటిత రంగంలోనే..
పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలంటే వారి ఆదాయం పెరగాల్సిన అవసరమున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు పట్టణ పేదల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకరోజు ఉపాధి దొరక్కపోతే జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్నటువంటి వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇవ్వాలని కోరారు. ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం మాదిరిగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని సూచించారు. కరోనా కారణంగా పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయని కేంద్ర మంత్రి నిర్మలకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఉపాధి అవకాశాలు పెరగాలి
ప్రస్తుతం పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులతోపాటు సమీప భవిష్యత్తులో పెరిగే పట్టణ పేదరికం అంచనాల నేపథ్యంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో పట్టణ పేదల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ కేంద్రానికి తెలిపారు. పట్టణ ప్రాంతాల వైపు భారీగా వలస వస్తున్న గ్రామీణ పేదల కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగాల్సిన అవసరమున్నదని చెప్పారు. జాతీయస్థాయిలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం పట్టణాలకే ఉన్నదని పేర్కొన్నారు. ఈ అసంఘటిత రంగంలో పేదలు పనిచేసేందుకు వీలు కల్పించేలా వారికి నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమంవంటి చర్యలను తాను ప్రతిపాదించే ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో దేశం చూసిన హృదయ విదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే పట్టణ అసంఘటిత రంగాన్ని బలోపేతం చేయడమొక్కటే మార్గమన్నారు. వివిధ రాష్ట్రాల ప్రజలు భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నందున దేశంలోని ఎకడివారైనా ఏ పట్టణంలోనైనా ఈ ఉపాధి హామీ లబ్ధి పొందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
21 శాతానికి చేరిన నిరుద్యోగం
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెకల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్యలో గరిష్ఠంగా 21% నిరుద్యోగం నెలకొని ఉన్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండటం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు, దేశంలోని వివిధ సంస్థలు పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని నొకి చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తృహరి మెహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఐఐ లాంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
పట్టణాలు ఆర్థిక గ్రోత్ ఇంజిన్లు
దేశంలోని పట్టణాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూతనందించాల్సిన అవసరం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పురపాలికలపై కూడా ఉన్నదని చెప్పారు. పురపాలికలు తమ పరిధిలో చేపట్టే హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, పట్టణాలలో చేపట్టే ఫుట్పాత్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ తదితర కార్యక్రమాల్లో పట్టణ పేద ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధికి హామీ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అనిశ్చిత ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలను దాటుకొని పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాధికి మరింత హామీ కల్పించడం మాత్రమే ఏకైక పరిషార మార్గమని, ఈ దిశగా కేంద్రప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ నిర్మలాసీతారామన్కు విజ్ఞప్తి చేశారు.