హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని షేక్పేట ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీని మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల లోపల, ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇక్కడ చదువుకొంటున్నారని, కాబట్టి వారిని సొంత బిడ్డల మాదిరిగా చూసుకోవాలని చెప్పారు.
వారికి గోరువెచ్చని తాగునీటిని అందించాలని, వేడివేడి ఆహారాన్ని వడ్డించాలని ఆదేశించారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, చకని విద్యాబుద్ధులతోపాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని, దీనికి తగినట్టుగా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.