జమ్మికుంట : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న 30 మంది నాల్గో తరగతి ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వైద్య సదుపాయాలు గొప్పగా మెరుగుపరుచుకున్నామన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు కంపు కొట్టేవని.. ప్రజలు, రోగులు వచ్చేందుకు భయపడే వారని.. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు మెరుగుపరిచారని, ఇంకా సదుపాయాలు కల్పించేందుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి కొప్పుల పేర్కొన్నారు. హైదరాబాద్ నలుమూలల, వరంగల్లో కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశారని వివరించారు. కేసీఆర్ కిట్ ద్వారా రూ.13వేలతో పాటు తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులు ఉచితంగా అందించడంతో పాటు అమ్మఒడి వాహనంలో గర్భిణులను తీసుకురావడం.. తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చుతుండడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు బాగా పెరిగాయని తెలిపారు. అన్ని జిల్లా, డివిజన్ కేంద్రాల్లో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లు ప్రారంభించినట్లు కొప్పుల గుర్తు చేశారు.