జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : ‘అన్నా ఎట్లున్నరే..? అమ్మా.. మంచిగున్నరా..? గడిచిన నాలుగైదు నెళ్లుగా ఇక్కడ్నే ఉంటున్నంగదా. పనులు ఎట్లా నడుత్తనయ్. రోడ్లు, కాల్వల పని జరుగుతున్నది..గదా. ఇంకేమన్నా సమస్య లుంటే చెప్పున్రి. పరిష్కరిస్తం. ఇది మన ప్రభుత్వం. మనకు సీఎం కేసీఆర్ అండగున్నడు. ఇయ్యాల కాదు.. ఇంకా రెండున్నరేండ్లు మనమే ఉంటం. ఏ పనిగావాలన్నా.. మనమే జెయ్యాలే. చేత్తం. చూపిత్తం. మాటలుండయ్. చేతలతోనే నడిపిస్తం.’ అంటూ కాలనీవాసులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముచ్చటించారు.
ఒక్కొక్కరితో మాట్లాడారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సమస్యేదైనా పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. ఎప్పుడైనా ఫోన్ చేయాలని, అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇన్నేండ్లు చేయని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నా మని తెలిపారు. సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో పర్యటించారు. వాడలన్నీ కలియతిరిగారు. కాలనీవాసులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం గురించి ఆరా తీశారు. ఇంకేమన్నా మిగిలిపోయిన పనులుంటే చెప్పాలని కోరారు.
హౌజింగ్ బోర్లు కాలనీలో వానలు పడితే ఇండ్లు మునిగి పోతున్నాయని, అందు కోసం శాశ్వత పరిష్కార మార్గాలు చూపిస్తామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే పక్కా ప్రణాళికా తయారు చేసి, వాన నీరు ఇండ్లలోకి రాకుండా చేస్తామని పేర్కొ న్నారు. బాధిత కుటుంబాలను ఆదుకున్న విషయాలను గుర్తు చేశారు. ఈటల ఇక్కడి ప్రజలను పట్టించుకోని వైనాన్ని ఎండగట్టారు. మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేదని, ఆయనకు అభివృద్ధి మీద ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తి పోయినంత మాత్రన వ్యవస్థ ఆగదని, హౌజింగ్ బోర్డుకు మేమున్నామని హామీ ఇచ్చారు. కాగా కాలనీ వాసులం దరూ మంత్రి చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీలకు, జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికు లతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. గెల్లు శ్రీనును గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.