జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశాన్ని అబద్దాలమయం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చిండు. రూ.10లక్షలిచ్చిండు. దళితులు ఎక్కడ బాగుపడుతారోనని దళిత బంధును ఆపిన్రు. పైగా మేం ఆపలేదని చెప్తన్రు.
బీజేపీల చేరిన ఈటల అదే అబద్దాలతో తిరుగుతన్రు. బీజేపీ నాయకుడు ప్రేమేందర్రెడ్డి ఏ పార్టీ నాయకుడో చెప్పాలే. దళిత బంధు అనేది ఎన్నికల కోసం ప్రవేశపెట్టలేదని, రెండు, మూడేళ్ల నుంచి సీఎం కేసీఆర్ దళిత బంధుపై మేధోమథనం చేశారని చెప్పారు. గొప్ప కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి.. వ్యతిరేకించడం.. తప్పుడు ప్రచారం చేయడం, దళితులను కన్ప్యూస్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొప్పుల.
బీజేపీ నాయకులు ప్రేమేందర్రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లనే దళిత బంధు ఆగిందని, బీజేపీ నాయకులు దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హెచ్చరించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే.. ఫిర్యాదుల చేసి దళితుల నోటికాడి బుక్కను లాగుతారా ..?అని ఫైర్ అయ్యారు. దళిత బంధు రానేరాదని..వచ్చినా.. అందరికీ ఇవ్వరు అని ప్రచారాలు చేసింది.అవన్నీ పటాపంచలు చేశాం అన్నారు సండ్ర.
ఈటలకు ఆస్తులను సంపాదించుకోవడంలో ఉన్న ప్రేమ ప్రజలపై లేదని, మంత్రిగా ఏనాడూ పద్మశాలీలను పట్టించుకున్న పాపానపోలేదని మాజీ మంత్రి ఎల్.రమణ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు దక్కిన గౌరవం మరెవరికీ దక్కలేదన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఈటల,పేదవాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టియ్యలేదని ప్రశ్నించారు. నిత్యం ధరలు పెంటుకుంటూ పోతున్న బీజేపీలో చేరిన ఈటల, ధరలు తగ్గించిన తర్వాతే ప్రజల్లోకి రావాలన్నారు. ఈటల రాజకీయ జీవితానికి ప్రజలు ఘోరీ కడుతారని ఎల్.రమణ అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ వీరేశలింగం, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.