హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయించాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని అమలు చేయాలని కొత్తగా డిమాండ్ చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పిచ్చి ముదిరి పాకాన పడిందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ నేతలు కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఏ అర్హతతో ఆ పథకం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దళితబంధుపై బీజేపీ డ్రామాలు ఆపాలని డిమాండ్చేశారు. గత ఏడేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దళితుల కోసం చేసిన ఒక్క పనైనా చెప్పగలరా అని నిలదీశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితుల కోసం ఏ చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొచ్చిన దళితబంధు పథకం సంపూర్ణంగా అమలై తీరుతుందని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పేదల కోసం పని చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తే బలహీనవర్గాలకు బీఆర్ అంబేద్కర్ ప్రసాదించి పెట్టిన రిజర్వేషన్లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలుచేసి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తారో, తాకట్టు పెడతారో ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని సవాలు విసిరారు. ఇటీవల దేశవ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. 32 స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాల్లోనే గెలుపొందిన బీజేపీ గ్రాఫ్ ఏమిటనేది తేలిపోయిందని పేర్కొన్నారు. ఓ వైపు ధాన్యం కొనలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఇక్కడేమో ధాన్యం కొనాలని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయటం సిగ్గుచేటని విమర్శించారు. ఈటల రాజేందర్కు గెలుపు గర్వం తలకెక్కిందని, అందుకే విర్రవీగుతూ మాట్లాడుతున్నారని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అతిగా ఊహించుకొని మాట్లాడొద్దని హెచ్చరించారు. బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయేవారు ఎవరూ లేరని స్పష్టంచేశారు. హుజూరాబాద్లో ఈటల బీజేపీ అభ్యర్థి కాదని, కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అని అన్నారు. అక్కడ తమ పార్టీకి వచ్చిన నష్టమేమీలేదని, తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నదని గుర్తుచేశారు. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును లొట్టపీసు కేసు’ అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ మాట్లాడటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులు నీకు లొట్టపీసుతో సమానమా? అని ప్రశ్నించారు. వెంటనే దళితులకు క్షమాపణ చెప్పి నిజామాబాద్ నడిబొడ్డున ముక్కు నేలకు రాయాలని డిమాండ్చేశారు.