Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రణాళికలు తయారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సూర్యాపేట జిల్లాకు సాగునీటిని అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు రైతాంగంతోపాటు అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న సిద్ధమవుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సభకు తరలివచ్చే ప్రజల సౌకర్యార్థం నలువైపులా ఉన్న రహదారులను మరమ్మతు చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించగా.. ఆ పనులను ఇవాళ ఉదయం నేరుగా పరిశీలించారు. సభకు తరలివచ్చే వారికోసం అన్ని ఏర్పాట్లు చేయాలని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు.
ఈ నెల 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్తోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొత్తం ఆరు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ పక్కన 70 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంతోపాటు నాలుగు మండలాల నుంచి జనాన్ని తరలించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇన్చార్జిలుగా నియమించారు. వారంతా గురువారం తమకు కేటాయించిన ప్రాంతాల్లో రంగంలోకి దిగారు.
స్థానిక నాయకత్వంతో కో ఆర్డినేట్ చేసుకుంటూ సీఎం సభకు వచ్చేవారు తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వాహనాల ఏర్పాటు తదితరాలను చూసుకుంటున్నారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయా ప్రాంతాల్లో ఆటోలు, కార్ల ద్వారా మైకుల్లో ప్రచారం చేపడుతున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, 15 వార్డులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, 19 వార్డులకు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట మండల ఇన్చార్జీలుగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఆత్మకూర్.ఎస్ మండలానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, చివ్వెంల మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, పెన్పహాడ్ మండలానికి నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు సభ విజయవంతం కోసం మంత్రి సూచనల మేరకు జన సమీకరణ, వాహనాల ఏర్పాటు తదితరాలను చూస్తున్నారు