సూర్యాపేట టౌన్, డిసెంబర్ 24 : ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసిన మోదీ సర్కార్.. వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై రైతుల తిరుగుబాటు మళ్లీ మొదలైందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ మాటలు తెలంగాణ ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. తెలంగాణ రైతాంగం, వ్యవసాయం, ఉపాధి హామీ నిధులపై కిషన్రెడ్డి, బండి సంజయ్ అర్థం లేని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వ్యవసాయ విధానాలు నచ్చకనే రైతులు పోరుబాట పడితే.. చివరకు ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పిన విషయం మరిచిపోయారా? అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ తమది రైతు అనుకూల ప్రభుత్వమనడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ర్టానికో విధానం పాటిస్తూ, ఇతర ప్రభుత్వాలు ఉన్నచోట వివక్ష చూపుతున్నారని మోదీపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు తెలంగాణ పథకాలు కావాలని కోరుకొంటున్నారని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు రైతులు తమను తెలంగాణలో కలుపాలని పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ వంటి అభివృద్ధిని యావత్ దేశం కోరుకొంటున్నదని, ఇతర రాష్ర్టాల ప్రజల ఆకాంక్ష మేరకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాల కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాడు దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.