సూర్యాపేట : కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం.. ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోని మిగతా రాష్ట్రాలు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందన్నారు. దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భవానికి కారణభూతంగా నిలిచిన భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ అనీ, ఆయన పేరును హైదరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.