హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ సోయి లేకుండా.. మతిస్థిమితం లేని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఒక్క పనికొచ్చే మాట మాట్లాడడం లేదని.. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏ ధాన్యం వేయాలో ముందుగానే రైతులకు స్పష్టంగా చెప్పాలని, ఇప్పుడే తేల్చాలని.. సమస్యను పుట్టించిందే బండి సంజయ్ అని ధ్వజమెత్తారు. కేంద్రం చెప్పినట్లు తాము రైతాంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణంలో సోయి లేకుండా మాటలు మాట్లాడి తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
బండి సంజయ్పై రైతులు మండిపడుతున్నరు
బండి సంజయ్ తీరుపై రైతులు మండిపడుతున్నరని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దొడ్డు వడ్లను కేంద్రం కొంటుందా? లేదా? చెప్పాలనేది రైతుల ప్రశ్న అని, దొడ్డు వడ్లు పండిస్తే కేంద్రం కొంటదా? లేదా అని అడుగుతున్నారన్నారు. ఏ పంట వేయక ముందు రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మీం ఇప్పుడు దొడ్డు వడ్లు పెడితే తీసుకుంటడ? ఎంత తీసుకుంటుడు రైతులు ప్రశ్నిస్తున్నారని మంత్రి అన్నారు. గత యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం ఇంకా పూర్తిగా తీసుకోలేదని, తెలంగాణలో ఇంత ధాన్యం వస్తదా? అని కేంద్రం అంటుందన్నారు. సీఎం కేసీఆర్ వివరాలు చెప్పిన తర్వాత మరో 20లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని అన్నారని పేర్కొన్నారు. వానాకాలంలో రైతుల వద్ద ఎంత ఉంటే అంత ధాన్యం తీసుకోవాలని డిమాండ్ మంత్రి డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ఎవరి మెడలు వంచుతరు
ఓ వైపు కేంద్రం, మంత్రులు, అధికారులు బాయిల్డ్ రైస్ ఒక గింజకొమని చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు మేం మెడలు వంచి కొనిపిస్తమని మాట్లాడుతున్నరని, బండి సంజయ్ కేంద్రం మెడలు వంచుతర? ప్రధాని మెడలు వంచుతర? అధికారుల మెడలు వంచుతర? అని ప్రశ్నించారు. ఈ గందరగోళం నుంచి రాష్ట్ర రైతాంగాన్ని బయటపడేయాలని సీఎం కేసీఆర్ అడిగారన్నారు. ఓ వైపు దీక్షలో ఉండగానే కేంద్రం నుంచి పేరు కూడా చెప్పడం ఇష్టం లేకుండా యాసంగిలో ఒక గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పిందన్నారు.
కేంద్రం, బీజేపీ నాటకాన్ని ప్రజలు గమనించాలి
కేంద్రం బాయిల్డ్ రైస్ కొనమని చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు వరి తప్ప మరేది సాగు చేయొద్దని అంటున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతల నాటకాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. బీజేపీ నేతలకు రైతుల ప్రాణాలు, ప్రయోజనాలు పట్టవన్నారు. రాష్ట్ర రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఫిబ్రవరిలో మాట్లాడాలని బండి సంజయ్ తిక్క మాటలు మాట్లాడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ఇప్పుడు యాసంగి ధాన్యం ఎంత కొంటారో ఇప్పుడే చెప్పడంలో ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఏ రకం వరి వేయాలో కేంద్రం, సంజయ్ స్పష్టం చేయాలన్నారు. యాసంగిలో ధాన్యం కొనేది లేదని స్పష్టం చేస్తే రైతులు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారన్నారు.
కేంద్రం వద్దన్నందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పామన్నారు. బండి మతిలేని మాటలు మాట్లాడుతున్నడని, సాగు గురించి ఏమి తెలియని అజ్ఞాని అంటూ విమర్శించారు. వడ్లు పైన పండుతయా? భూమిలోపల పండుతయా తెలియని మూర్ఖుడు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు రైతుబీమా అందిస్తున్నారన్నారు. రైతు ఏ కారణం చేతనైనా చనిపోయినా రూ.5లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ఏ పంట ఎంత పండించాలన్న సిద్ధమని సీఎం అన్నారు. తెలంగాణలో 22 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి, నేడు 1.47కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందని, ఏ రాష్ట్రంలోనైనా 6వేలకుపైగా కేంద్రాల్లో ధాన్యం కొంటారా? అన్నారు. రాష్ట్రం పట్ల, రైతులపై సీఎం కేసీఆర్కు బాధ్యత ఉన్నదన్నారు.