సూర్యాపేట : విమోచనం పై అమిత్ షాతో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం దురదృష్టకరం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలనే దుర్మార్గానికి పాల్పడుతున్న అలాంటి వారు దేశ మనుగడకు చాలా ప్రమాదకరం అన్నారు. ఓట్ల రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
అన్నదమ్ముల్లా కలిసి ఉన్నా తెలంగాణ సమాజంలో చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుట్రలను తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా ప్రజలు ఉందని పేర్కొన్నారు. అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. ఇక కర్ణాటకలో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేశారని చెప్పారు.
కర్ణాటకలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, కాంగ్రెస్ తన అసలు స్వరూపం బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గత చరిత్ర ప్రజలకు తెలుసు అన్న మంత్రి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీవి పగటి కలలే అవుతాయని ఎద్దేవా చేశారు.