హైదరాబాద్ : ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయని, రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సన్నాల కొనుగోళ్లు మొదలయ్యాయని, అందరూ ఏకకాలంలో మిల్లుల దగ్గరికి వెళ్తే నష్టపోతారన్నారు. ఆ వంకతో దళారులు ధర తగ్గించే ప్రమాదం ఉందని రైతులను హెచ్చరించారు. మిల్లుల కెపాసిటీని బట్టి టోకెన్లు జారీ చేస్తున్నామని ప్రకటించారు. టోకెన్ల జారీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. పథకం ప్రకారమే.. టోకెన్లు జారీ చేస్తున్నామని, రెవెన్యూ, సివిల్ సప్లయ్తో పాటు వ్యవసాయశాఖ, పోలీస్శాఖ పరస్పరం సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో రైతులు ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
2014 కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన పంట కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులేనని.. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట దిగుబడి 46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మార్క్ పరిపాలనకు పంట దిగుబడి నిదర్శనమన్నారు. అందుకు తెలంగాణా సమాజం గర్వ పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతే కాదు.. ఎప్పుడూ రైతుల పక్షమేనంటూ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.