నిర్మల్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని రాంపూర్ లో ప్రాథమిక, అంగన్ వాడీ పాఠశాలలను, దర్యాపూర్ లోని ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులలో విద్యార్థుల ప్రావీణ్యాన్ని కూడా మంత్రి పరీక్షించారు. చిన్నారులతో ఏబీసీడీలు చెప్పించారు. రైమ్స్ పాడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను అభినందించారు. అలాగే పాఠశాలలో కొవిడ్ నిబంధనల అమలు తీరు, తరగతి గదుల్లో విద్యార్థుల సీటింగ్, హాజరు శాతాన్ని పరిశీలించారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించాలని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు.