హుజూరాబాద్: ఈటల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు ఆరుసార్లు గెలిపిస్తే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా పూర్తిచేయలేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున మంత్రి హరీశ్రావు గురువారం ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీశ్రావుతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు ధర్మరాజుపల్లి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు. ఈటల రాజేందర్ స్వార్థంవల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు..? హుజూరాబాద్ జిల్లా కావాలనా? లేదా హుజూరాబాద్కు మెడికల్ కాలేజి కావాలనా? అని ప్రశ్నించారు. తన స్వలాభం కోసమే ఈటల రాజీనామా చేశారన్నారు.
గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న బీజేపీలో ఈటల రాజేందర్ ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి చేసిన బీజేపీ..తాజాగా మరో రూ. 15లు పెంచిందని మండిపడ్డారు. బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్, వంటనూనెల ధరలు పెంచుతూ సామాన్యుడి బతుకు దుర్భరం చేస్తున్నదన్నారు. ధరలు పెంచుతూ మనల్ని దగా చేస్తున్న బీజేపీకి ఓటేద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. తాను రాజీనామా చేస్తేనే ఇప్పుడు హుజూరాబాద్లో పనులు జరుగుతున్నాయని ఈటల చెప్పుకుంటున్నారని, మరి కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఎవరిని చూసి కేసీఆర్ ఇచ్చారని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రైతుబంధు అందుకున్న తొలిరైతు ధర్మరాజుపల్లివాసేనని గుర్తుచేశారు. కరోనా సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి మరీ సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని చెప్పారు. ఆసరా పింఛన్లు ఆపలేదన్నారు. రేషన్కార్డుదారులకు రూ. 1500, బియ్యం, పప్పులు అందజేశామని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి రూ. లక్ష సాయం అందుతోందా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మరి ఇలాంటి పథకాలు వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని, కల్యాణలక్ష్మి పథకం ఉండాలా? వద్దా? మీరే చెప్పాలని ప్రజలనుద్దేశించి అన్నారు. తాము గెలిస్తే విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో రూ. 15లక్షలు వేస్తామని బీజేపీ వాళ్లు చెప్పారని, ఒక్కరి అకౌంట్లోనైనా ఆ డబ్బులు పడ్డాయా? అని ప్రశ్నించారు. ధరలు పెంచి, సబ్సిడీలో కోతలు పెడుతున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్రావు ప్రజలను కోరారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిచిన వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తిచేయించి, లబ్ధిదారులతో గృహం ప్రవేశం చేయిస్తానని మాట ఇచ్చారు.