హుజూరాబాద్ : ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా నాలుగు ఓట్లు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బీజేపీ పార్టీ నాయకులు గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్రావు ప్రతేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మంత్రులు, నాయకులు కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని, వాళ్ళే గొడవలకు దిగుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రుద్దుతున్నారని పేర్కొన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే ఓటమి భయంతో బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రేమేందర్రెడ్డితో కేంద్ర ఎన్నికల సంఘానికి దళితబంధు ఆపాలంటూ లేఖ రాపించాడని తెలిపారు. ఓ వైపు తప్పులు చేస్తూనే మరో వైపు టీఆర్ఎస్ పార్టీపై నెడుతూ ఈటల రాజేందర్ జూటా మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తూ రోడ్డున పడేసిన బీజేపీ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతన్నాయని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రైతు వ్యతిరేక పార్టీలో చేరిన ఈటల రాజేందర్కు ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మామిడాలపల్లి గ్రామంలో ముద్దసాని కశ్యప్రెడ్డి ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, రాష్ట్ర నాయకులు ముద్దసాని కశ్యప్రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతి-రమేష్, ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య, బండ సుజాత-కిషన్రెడ్డి, మూల రజిత-పుల్లారెడ్డి, నాయకులు బొంగోని రాజయ్య, నారాయణ, తాండ్ర శంకర్, దూడం సదానందం, జీవన్కుమార్, మల్లారెడ్డి, సంపత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.