హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే..హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. హుజూరాబాద్ మండలంలోని ఇందిరానగర్, శాలపల్లిలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ, ఇవి నడుమంతరపు ఎన్నికలని, ఇంకా రెండున్నరేళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ ఏ పని జరగాలన్నా సీఎం ప్రేమ ఉండాలని, అందుకే మనమంతా గెల్లును గెలుపించుకొని కేసీఆర్కు గిఫ్ట్గా ఇద్దామన్నారు. ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ ఉండేది ఢిల్లీలో.. ఇక్కడ ఉండేది టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ సంపదను పెంచి పేదలకు పంచుతోందని స్పష్టంచేశారు. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసిన ఘనత బీజేపీ సర్కారుదేనని, సబ్సిడీ కూడా ఎగగొట్టారని విమర్శించారు. ఓ వైపు పేదలపై భారం మోపుతున్న బీజేపీ సర్కారు..మరోవైపు పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్న వ్యాపారవేత్తలకు రూ. పది లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. నిరుపేదలకు, రైతులకు బీజేపీ సర్కారు చేసిందేమీ లేదన్నారు.
అన్నదాతలతోపాటు అన్ని వర్గాలనూ ఆదుకుంటున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అభాగ్యులకు ప్రతినెలా ఠంచనుగా రూ. 2016 /3016 ఆసరా పింఛన్ ఇస్తున్న ఏకైక సర్కారు తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద ఆడబిడ్డల పెళ్లిల్లకు అక్షరాల లక్ష నూటా పదహార్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు యాసంగి, వానాకాలం పంటకు కలిపి ఎకరానికి పది వేల పెట్టుబడి ఇస్తున్నామని వివరించారు. ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ను పట్టుకొని ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. ఈ శాలపల్లిలోనే ఈటల రాజేందర్ను తన తమ్ముడంటూ సీఎం కేసీఆర్ ఆప్యాయత చూపారని గుర్తుచేశారు. కానీ ఈటల రాజేందర్ కృతజ్ఞత లేకుండా కేసీఆర్ను తిడుతున్నాడని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఈటల రాజేందర్..గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పు? అని హరీశ్రావు ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేని ఈటల.. రేపు ఎలా గెలుస్తాడు..? ఎలా ఇల్లు కట్టిస్తాడు..? అనేది హుజూరాబాద్ ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
ఈటల రాజేందర్ గెలిస్తే కేంద్ర మంత్రితో మాట్లాడి గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500 చేయిస్తాడా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేడయమంటే మన వేలితో మన కన్నునే పొడుచుకోవడంలాంటిదని వ్యాఖ్యానించారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే.. హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదేనని చెప్పారు.