సంగారెడ్డి : కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ఫైర్ అయ్యారు . జిల్లాలోని నారాయణఖేడ్ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ల నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు.
ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. ఇటలీ బొమ్మ అన్నాడు. నోటికి ఏదోస్తే అదే తిట్టిండు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలన్నారు. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు. మేం ఎవ్వరికీ బీ టీం కాదు.
మేం తెలంగాణ ప్రజల టీం. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికి ఒకటి కాదన్నారు. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా? ఇది కూడా అంతేనని స్పష్టం చేశారు. కేసీఆర్కి పనితనం తప్పా పగతనం లేదని, కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసేవారన్నారు. పక్క రాష్టాల్లో చూస్తున్నాం. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లని జైలుకి పంపిస్తారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదన్నారు.