సిద్దిపేట : ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లి తండ్రులు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఎంత ఆనందం పొందుతారో.. జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే నేను కూడా అంతే సంతోషపడ్డానన్నారు. జిల్లా ఏర్పాటైన తొలినాల్లలో 13 స్థానంలో ఉండేది. తర్వాత 9 వ స్థానంలో, అదే దిశగా 3 వ స్థానంలో మరింత కష్ట పడితే 2 వ స్థానంలో నిలిచిందన్నారు.
ఈ సారి ఎలాగైనా ఫస్ట్ నిలవాలి అని ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ సంవత్సరం ప్రథమ స్థానం సాధించడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ సంవత్సరం 97% తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాం. ఈ ఫలితాన్ని పదిలంగా కాపాడుకోవాలని , 100 శాతం ఉత్తీర్ణత దిశగా మరింత కష్ట పడుతూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు.
జిల్లాలో మూడు మండలాలు 100 % ఫలితాలు..
పది ఫలితాల్లో మూడు మండలాలు మార్కుక్, అక్కన్నపేట, రాయపోల్ మండలాలు 100 % ఉత్తీర్ణత సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూడు మండాలాల ఎంఈవోలను సన్మానించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఉపాధ్యాయులకు మిఠాయిలు తినిపించి, జిల్లా విద్యాశాఖ అధికారిని మంత్రి సన్మానించారు.