సంగారెడ్డి : జహీరాబాద్ ప్రాంతంలో సాగైన చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి ట్రైడెంట్ చక్కెర కర్మాగారం చైర్మన్, జహీరాబాద్ శాసన సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్, సీడీసీ, డీసీఎంఎస్ చైర్మన్, గణపతి షుగర్, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ ప్రాంత చెరకు రైతుల సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే క్రషింగ్ ప్రారంభించాలని కంపెనీ యాజమాన్యానికి ఆదేశించామన్నారు. సాగైన మొత్తం చెరుకును క్రషింగ్ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్, గాయత్రి షుగర్, కామారెడ్డి మాగి షుగర్, కొత్తకోట ఫ్యాక్టరీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు జహీరాబాద్ ప్రాంత చెరుకును క్రషింగ్ చేయడానికి సమ్మతించారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్నిరకాల చర్యలు చేపడుతుందని, జహీరాబాద్ చెరుకు రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసానిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ శాసన మండలి సభ్యుడు ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ట్రైడెంట్ చక్కెర కర్మాగారం చైర్మన్ నందకుమార్, గణపతి, గాయత్రి చెక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యం, చక్కెర శాఖ కమిషనర్ బద్రు మాల్, ఏడీ రవీందర్, వ్యవసాయ శాఖ ఏడీ భిక్షపతి పాల్గొన్నారు.