కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar ) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వి కన్వేన్షన్ హాల్ లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి నేతకార్మికుల జీవితాలు దుర్భరంగా ఉండేవని ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలతో నానా కష్టాలు పడేవారని పేర్కొన్నారు.
రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) నేతన్న కుటుంబాల్లో సంతోషం నింపేందుకు ఎన్నో పథకాలు (Schemes) తీసుకువచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో సంపద పెరగాలే, పెరిగిన సంపద పేదలకు పంచాలన్నదే సీఎం లక్ష్యమని అన్నారు. నేతన్నలు కంప్యూటర్ సమానంతో మగ్గాలపై చీరనేసే విధానం అద్భుత ఘట్టమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్ట్ ఫండ్ పథకం పై నేత కార్మికులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నామని అన్నారు.
రైతుబంధు (Raitu Bandu) పథకం మాదిరి నేతన్నల జీవితాల్లో బరోసా కలిగించే విధంగా నేతన్నబంధు పథకాన్ని తీసుకువచ్చి రూ. 5లక్షల బీమా (Insurance) ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 36 వేల మంది నేత కార్మికులను ఈ పథకంలో చేర్చామని తెలిపారు. పండుగల సందర్భంగా అందజేస్తున్న చీరలు, దుస్తుల తయారి నేత కార్మికులకే ఇవ్వడం ద్వారా నేతన్నలకు ఉపాధి పెరిగిందని అన్నారు.
తెలంగాణలోని కోకాపేటలో పద్మశాలీ కుల సంఘానికి రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ. 2 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో నేతన్నకు చేయుత పథకం, చేనేత మిత్ర పథకం, పావలావడ్డి పథకం, క్యాష్ క్రెడిట్ చెక్కులను అందజేశారు.
అనంతరం కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహితను సత్కరించి , ముగ్గురు నేతన్నలకు ఐటీ కార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో చేనేత జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, నగర మేయర్ వై. సునీల్ రావు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. గోపి , కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.