హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ సారి ఇదే సమయానికి 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించినట్లు పేర్కొన్నారు. కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో 6,129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమే కాకుండా 35 కేందాల్లో కొనుగోళ్లు పూర్తికావడంతో మూసివేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 4.16లక్షల మందికిపైగా రైతుల నుంచి దాదాపు 26 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని ఈ ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు చేరవేస్తున్నట్లు చెప్పారు. మిల్లర్లు గుర్తించిన విలువ రూ.2,390 కోట్లకు గాను రూ.2,154 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.